న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: అయోధ్యలోని రామాలయ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. డిసెంబర్ కల్లా మొదటి అంతస్తు పూర్తవుతుందని, వచ్చే ఏడాది జనవరిలో ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 20-24 మధ్య జరిగే ఈ ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తారని, అయితే ఇంకా తేదీ ఖరారు కాలేదని, బహుశా 22న జరుగవచ్చునని చెప్పారు.
సంక్రాంతి తర్వాత ప్రతిష్ఠ ఉత్సవాలకు శ్రీకారం చుడతామని, అయితే భక్తులను మాత్రం 24 నుంచి అనుమతిస్తామని తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి 10 వేల మందిని ఆహ్వానించాలని ప్రాథమికంగా లిస్టు తయారైందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రామనవమి రోజు సూర్యుడి కిరణాలు గర్భగుడిలోని రాముని నుదిటిపై తాకేలా ఆలయ శిఖరంలో ఉపకరణాల అమరికకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.