పశ్చిమ బెంగాల్ : హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. మంటల్లో మొత్తం నాలుగు బోగీలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదంలో ఒక్క ప్రయాణికుడికి కూడా చిన్న గాయం కాకుండా ఉండటానికి ఓ వ్యక్తి కారణం. ఒక బోగిలో మంటలు వ్యాపించిన విషయాన్ని గమనించిన ఆ వ్యక్తి వెంటనే చైన్ లాగడంతో రైలు ఆగింది. దీంతో ఆ బోగిలో ఉన్న ప్రయాణికులు వెంటనే కిందకు దిగారు. మిగతా బోగీల ప్రయాణికులను సైతం కిందకు దింపారు. చూస్తుండగానే మంటలు పక్క బోగీలకు అంటుకున్నాయి. చైన్ లాగకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే భయమేస్తుంది అంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే… చైన్లాగిన వ్యక్తి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మంటలు అంటుకున్నపుడు భయపడి ఆందోళనకు గురయ్యాడో ఏమో మొత్తం మీద అతన్ని రైల్వే సిబ్బంది ఆసుత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చైన్ లాగిన వ్యక్తిది శ్రీకాకుళం జిల్లా పలాస అని తెలుస్తున్నది.