కేంద్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలు వాస్తవ పరిస్థితికి ఎంత దూరంగా ఉంటున్నాయో.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయి పరిస్ధితులకు ఎంత దగ్గరగా ఉంటున్నాయో చెప్పేందుకు ఇదొక చక్కని ఉదాహరణ.
దేశవ్యాప్తంగా పౌష్ఠికాహారలోపంతో రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న పిల్లలు, మహిళల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోషణ్ అభియాన్ స్కీమ్కు ఏడాదికి రూ.145 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుండగా, ఇదే సమస్యను అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి కేవలం 9 జిల్లాలకే ఏడాదికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నది.
స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5(2019-21) నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పౌష్టికాహారలోపం, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు(6-59 నెలలు) 67 శాతం మంది ఉన్నారు. మహిళలు(15-49 సంవత్సరాలు) 57 శాతం మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2018లో పోషణ్ అభియాన్ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించింది. అమల్లోకి తెచ్చిన మూడేండ్లకే ఈ స్కీమ్ను అటకెక్కిస్తూ భారీగా నిధుల కోత పెట్టింది. ఈ పథకం గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ గత ఏడాది రూ.145 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. అంటే దేశవ్యాప్తంగా పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న 6.5 కోట్ల మంది మహిళలు, శిశువులకు రూ.145 కోట్లు వ్యయం చేయడమంటే, ఏడాది మొత్తంగా ఒక్కొక్కరిపై రూ.22 మాత్రమే ఖర్చు చేయడం. బహుశా ఇలాంటి పథకం మన దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడా లేకపోవచ్చు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 నివేదిక (2015-16) ప్రకారం.. పిల్లల్లో రక్తహీనత కలిగిన వారి సంఖ్య 58.6 శాతం కాగా, అది 2019-21 సర్వే ప్రకారం 67 శాతానికి పెరిగింది. మహిళలో రక్తహీనత సమస్య 53 నుంచి 57 శాతానికి పెరిగింది. రక్తహీనత సమస్య ఎక్కువగా ఎదుర్కొంటున్న పిల్లలున్న రాష్ర్టాల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలే ముందున్నాయి. వీటిలో గుజరాత్లో 80%, మధ్యప్రదేశ్లో 73% ఉన్నారు.
రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్న 9 ఏజెన్సీ ప్రాంత జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని గత నెల నుంచి ప్రారంభించింది. ఎంపిక చేసిన జిల్లాల్లో ఆదిలాబాద్, కొత్తగూడెం, వికారాబాద్, నాగర్కర్నూల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, ములుగు, భూపాలపల్లి, గద్వాల ఉన్నాయి. ఈ జిల్లాలోన్లి 1.24 లక్షల మంది గర్భిణులకు రెండు దఫాలలో న్యూట్రిషన్ కిట్లను అందజేస్తారు. ఒక్కో కిట్లో రూ.2 వేల విలువైన పోషక పదార్థాలు ఉంటాయి. వీటిని ఆరు నెలలకు ఒకసారి ఏడాదికి రెండేసి చొప్పున (రూ.4 వేల విలువ) అందజేస్తారు. ఈ పథకం కింద 9 జిల్లాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నది.