న్యూఢిల్లీ: ఒళ్లు నొప్పులు, జ్వరం, పంటి నొప్పులకు చికిత్సలో మెఫ్తాల్ (ఎంఈఎఫ్టీఏఎల్)ను వైద్యులు సూచిస్తూ ఉంటారు. రుతుస్రావానికి సంబంధించిన నొప్పులు, రుమటాయిడ్ ఆర్తరైటిస్ను నయం చేయడానికి దీనిని వాడటం సాధారణంగా మారిపోయింది. అయితే దీని వాడకం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తున్నట్లు ప్రాథమికంగా వెల్లడైందని కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని ‘ది ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్’ (ఐపీసీ) హెచ్చరించింది. దీనిని వాడినపుడు రోగుల్లో కనిపించే ప్రతికూల ప్రభావాన్ని పర్యవేక్షించాలని వైద్య నిపుణులకు, రోగులకు చెప్పింది.
ఫార్మా కోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా (పీవీపీఐ) డాటాబేస్ను పరిశీలించినపుడు యూసినోఫిలియా, సిస్టమిక్ సింప్టమ్స్ సిండ్రోమ్ (తెల్ల రక్త కణాలు ఎక్కువగా చేరడం) కనిపించినట్లు తెలిపింది. మెఫ్తాల్ను వాడినవారిలో ఇలాంటి దుష్ప్రభావాలు కనిపించినట్లయితే, పీవీపీఐ జాతీయ సమన్వయ కేంద్రానికి తెలియజేయాలని తెలిపింది. www.ipc.gov.in వెబ్సైట్ ద్వారా కానీ, హెల్ప్లైన్ నెం.1800 180 3024 ద్వారా కానీ సంప్రదించాలని కోరింది. దేశీయ ఔషధాలకు ప్రమాణాలను ఐపీసీ నిర్ణయిస్తుంది.