న్యూఢిల్లీ, మే 21: పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ పన్నును కేంద్రప్రభుత్వం తగ్గించింది. పెట్రోల్పై రూ.8, డీజిల్పై 6 తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ట్వీట్ చేశారు. మొత్తంగా పెట్రోల్పై రూ.9.5, డీజిల్పై రూ.7 తగ్గనున్నదని తెలిపారు. వంటగ్యాస్ సిలిండర్పై రూ.200 సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఇది ప్రధాన్మంత్రి ఉజ్వల్ కల్యాణ్ యోజన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఈ సబ్సిడీని వినియోగదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేస్తామని వెల్లడించారు. కేంద్రప్రభుత్వం నిరుపేద మహిళలకు ఉజ్వల్ కల్యాణ్ యోజన కింద ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నది. దేశంలో దాదాపు 30 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఉజ్వల్ పథకం లబ్ధిదారులు 10 కోట్లమందే ఉన్నారు. తాజా తగ్గింపు ఈ 10 కోట్ల కనెక్షన్లకే వర్తించనున్నది.
గుంజుకొంటున్నది 4.. ఇస్తున్నది 1
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తాజా తగ్గింపు వల్ల కేంద్రప్రభుత్వం ఏటా రూ.లక్ష కోట్ల ఆదాయం కోల్పోనున్నదని నిర్మలాసీతారామన్ ఆవేదన వ్యక్తంచేశారు. కానీ, వాస్తవాలు వేరేలా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ ఎనిమిదేండ్లలో పెట్రోల్, డీజిల్పై పన్నుల రూపంలో రూ.26 లక్షల కోట్లకుపైగా ప్రజల నుంచి పిండుకొన్నది. ఒక్క 2021 సంవత్సరంలోనే ఏకంగా రూ.3.7 లక్షకోట్లు కేం ద్ర ఖజానాకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగి లీటర్ పెట్రోల్ రూ.120కి చేరటంతో కేంద్రానికి దాదా పు రూ. 4 లక్షల కోట్ల ఆదాయం రావచ్చని ముం దస్తు అంచనాలున్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూ టీ తగ్గింపువల్ల అందులో కోల్పోతున్న ఆదాయం రూ.లక్ష కోట్లు మాత్రమే. కేంద్రం తీరు ఎడమచేత్తో ఇచ్చి కుడిచేతితో లాగేసుకొన్నట్టు ఉన్నదని మార్కెట్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.
ఇప్పటికీ భారీగానే ధరలు
కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా సామాన్యుడిని బెంబేలెత్తించే స్థాయిలోనే ఉండనున్నాయి. హైదరాబాద్లో శనివారం లీటర్ పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49 ఉన్నది. తాజా తగ్గింపుతో ఆదివారం నుంచి లీటర్ పెట్రోల్ రూ.110, లీటర్ డీజిల్ రూ.99.49 ఉండనున్నది. ఎనిమిదేండ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికంటే తాజా రేట్లు భారీగానే ఉన్నాయి. 2014, మే 26న లీటర్ పెట్రోల్ 71.41, లీటర్ డీజిల్ రూ.55.49 మాత్రమే. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు 108 డాలర్లు ఉన్నది. శనివారం కూడా బ్యారెట్ చమురు 110-111 మధ్య కొనసాగింది. అంటే నాటికి నేటికి ముడి చమురు ధరలో రెండు డాలర్లు మాత్రమే తేడా కానీ, పెట్రోల్ ధరలో దాదాపు రూ.30, డీజిల్ ధరలో దాదాపు రూ.44 తేడా ఉన్నది. దీనినిబట్టి చూస్తే నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతకు భయపడి కొంత వరకు ధరలు తగ్గించినట్టు కనిపిస్తున్నా, ఇప్పటికీ సామాన్యుల నుంచి భారీగానే పిండుకొంటున్నదని ఆర్థికవేత్తలు అంటున్నారు.
గ్యాస్ ధర తగ్గింపు సర్కారుకే లాభం
ప్రధాన్మంత్రి ఉజ్వల్ కల్యాణ్ యోజన పథకం లబ్ధిదారులకు 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్పై రూ.200 సబ్సిడీ కింద అందిస్తామని నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గత నెల 25 నాటికి 10,36,05,611 మంది లబ్ధిదారులున్నారు. సిలిండర్ ధర రూ.వెయ్యి దాటిపోవటంతో వీరిలో కోటిమంది గత ఏడాది నుంచి సిలిండర్ రీఫిల్ చేయించుకోనేలేదు. గ్యాస్ వాడకం మోయలేని భారంగా మారటంతో వీరంతా మళ్లీ కట్టెల పొయ్యిపై ఆధారపడటం మొదలుపెట్టారు. తాజా ధర తగ్గింపుతో ఈ కోటిమంది సిలిండర్ రీఫిల్ చేయించుకొంటే వినియోగదారులకంటే సర్కారుకే ఎక్కువ లబ్ధి చేకూరనున్నది.
సిలిండర్పై ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అంటే ఇప్పుడు సిలిండర్కు రూ.1003 ఉన్నందున ఒక్కో సిలిండర్పై ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో రూ.50 వస్తుంది. కోటిమంది రీఫిల్ చేయిస్తారనుకొంటే ఒక్క దఫాలోనే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.50 కోట్లు అవుతుంది.