న్యూఢిల్లీ, జనవరి 10: జేఈఈ అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ ఊరట కల్పించింది. అర్హత నిబంధనలను సడలించింది. ఐఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు, జేఈఈ అడ్వాన్స్డ్కు హాజరయ్యేందుకు 12వ తరగతి బోర్డు పరీక్షలో 75 శాతం మార్కులు రాకపోయినప్పటికీ, ఆయా ఎడ్యుకేషన్ బోర్డుల్లో టాప్ 20 పర్సెంటైల్లో నిలిచినా అర్హులేనని తెలిపింది. జేఈఈ అడ్వాన్స్డ్కు ఇంటర్లో 75 శాతం మార్కుల తప్పనిసరి నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్లు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం వెలువడింది. ‘తమ 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించలేని వారికి 20 పర్సెంటైన్ నిబంధన ఉపయోగపడుతుంది.
చాలా మంది టాప్ 20 పర్సెంటైల్లో నిలిచినా బోర్డు పరీక్షల్లో 75 శాతం కంటే తక్కువ మార్కులు సాధిస్తున్నందున, వారిని కూడా అర్హులుగా ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జేఈఈ మెయిన్ తొలి విడుత పరీక్షకు 12వతేదీతో రిజిస్ట్రేషన్లు ముగుస్తాయి. ఈ నెల 24, 31న పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్ బులెటిన్ ప్రకారం.. ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, సీఎఫ్టీలో ప్రవేశాలకు ఆలిండియా ర్యాంకుతోపాటు 12వ తరగతిలో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించి ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 65 శాతం మార్కులు సాధించాలి. కరోనా నేపథ్యంలో 2020,21,22లో ఈ నిబంధనను మినహాయించారు.