చండీగఢ్, మే 16: గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధాన్ని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. మోదీ సర్కార్ తన రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గోధుమల ఎగుమతి నిషేధాన్ని రైతు వ్యతిరేక నిర్ణయంగా పంజాబ్ రైతు సంఘాలు అభివర్ణించాయి. గోధుమలకు ఉన్న డిమాండ్, ధరల ప్రయోజనాలు రైతులకు దక్కనీయకుండా కేంద్రం కుట్రలు పన్నుతున్నదని పేర్కొన్నాయి. మరింత ధరలు వస్తాయన్న ఆశతో ప్రధానంగా పంజాబ్లోని అనేక మంది రైతులు తమ పంటను నిల్వచేసుకున్నారని, అయితే ప్రభుత్వం వారి కండ్లలో పొడిచిందని విమర్శించాయి.
ఇదే సమయంలో ఈ ఏడాది మార్చిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల గోధుమ దిగుమతులు తగ్గాయని, ఈ నేపథ్యంలో క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేసినా ఇప్పటివరకు పట్టించుకోలేదని పేర్కొన్నాయి. బీకేయూ(ఏక్తా ఉగ్రహన్) ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్ మాట్లాడుతూ గోధుల రైతులను కేంద్ర నిలువనా మోసం చేసిందన్నారు. కేంద్రం నిర్ణయాన్ని ఖండించిన బీకేయూ(లఖోవాల్) ప్రధాన కార్యదర్శి ఎగుమతులు కొనసాగించాలని డిమాండ్ చేశారు.