Central Debt | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: కేంద్ర ప్రభుత్వ స్థూల రుణం అంతకంతకూ పెరిగిపోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (క్యూ1) 2.2 శాతం పెరిగి రూ.159.53 లక్షల కోట్లకు చేరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరినాటికి ఇది రూ.156.08 లక్షల కోట్లు. చెల్లించాల్సిన అప్పుల్లో 26.6 శాతం రుణాలకు ఐదేండ్లలోపు కాలపరిమితి ముగియనుందని ఆర్థిక శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2023-24 తొలి త్రైమాసికంలో ఇష్యూయెన్స్/సెటిల్మెంట్ ప్రాతిపదికన డేటెడ్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.4.08 లక్షల కోట్లను సమీకరించగా, ‘స్విచ్ఛెస్’ (స్వల్పకాలిక బాండ్ల చెల్లింపునకు బదులు దీర్ఘకాలిక బాండ్లు జారీచేయడం) కోసం సర్దుబాటు చేసిన తర్వాత రూ.2.71 లక్షల కోట్లను సేకరించింది.
ఈ త్రైమాసికంలో జారీ అయిన బాండ్ల వెయిటెడ్ ఏవరేజ్ ఈల్డ్ (డబ్ల్యూఏవై) 7.13 శాతంగా ఉంది. 2022-23 జనవరి-మార్చి మూడు నెలల కాలంలో ఇది 7.34 శాతం. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జారీచేసిన బాండ్ల వెయిటెడ్ ఏవరేజ్ మెచ్యూరిటీ (డబ్ల్యూఏఎం) 17.58 సంవత్సరాలుకాగా, అంతక్రితం త్రైమాసికంలో ఇది 16.58 సంవత్సరాలు. ఇక సెకండరీ మార్కెట్లో 7-10 ఏండ్ల మెచ్యూరిటీ బకెట్లోనే ట్రేడింగ్ కార్యకలాపాలు కేంద్రీకృతమయ్యాయని, ముఖ్యంగా 10 ఏండ్ల బాండ్పై అధికంగా ట్రేడింగ్ జరిగిందని ఆర్థిక శాఖ నివేదిక వివరించింది.
సెకండరీ మార్కెట్లో ప్రైవేటు రంగ బ్యాంక్లు ట్రేడింగ్ జరిపాయని ‘బై’ డీల్స్లో 22.59 శాతం, ‘సెల్’డీల్స్లో 25 శాతం వాటా వీటిదేనని ఆర్థికశాఖ పేర్కొంది. తర్వా తి స్థానాల్లో విదేశీ బ్యాంక్లు, ప్రభుత్వ రంగ బ్యాంక్లు, ప్రైమరీ డీలర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. నికరంగా చూస్తే విదేశీ బ్యాంక్లు, బీమా కంపెనీలు, ప్రైవేటు రంగ బ్యాంక్లు, ప్రైమరీ డీలర్లు నికర విక్రయాలు జరపగా, ప్రభుత్వ రంగ బ్యాంక్లు, కో ఆపరేటివ్ బ్యాంక్లు, మ్యూచువల్ ఫండ్స్ సెకండరీ మార్కెట్లో నికరంగా కొనుగోలు చేశాయి.