న్యూఢిల్లీ, అక్టోబర్ 31: మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను నవంబర్ 2వ తేదీన అరెస్ట్ చేయవచ్చునన్న ఆందోళనను ఆ పార్టీ వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ముందు నవంబర్ 2న హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. ఆ రోజు ఈడీ ఆయనను అరెస్ట్ చేయవచ్చునని ఢిల్లీ మంత్రి ఆతిశీ మంగళవారం మీడియా సమావేశంలో ఆరోపించారు. కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇదే మొదటిసారి. కాగా, ఇదే కేసులో సీబీఐ ఆయనను ఏప్రిల్లో ప్రశ్నించింది.
ఎన్నికల్లో కేజ్రీవాల్ను నేరుగా గెలవలేమని తెలుసుకున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నదని ఆమె ఆరోపించారు. కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసి ఆప్ పార్టీని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆమె ఆరోపించారు. కేజ్రీవాల్ తర్వాత జార్ఖండ్ సీఎంహేమంత్ సోరెన్, తేజస్వి యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్లను కూడా టార్గెట్ చేయవచ్చన్నారు.