లక్నో: ఓ 13 ఏండ్ల బాలిక తీవ్ర గాయాలతో ఒక ప్రభుత్వ గెస్ట్హౌస్ పక్కన పడివుంది. తలకు కూడా గాయాలు ఉన్నాయి. ఒళ్లంతా రక్తపు మరకలు అయ్యాయి. ఇలాంటి దృశ్యం కంటబడితే ఎవరైనా ఏంచేస్తారు..? వెంటనే ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తారు. లేదంటే పోలీసులకు ఫోన్ చేసి చెబుతారు. అదీ చేతగాకపోతే కనీసం ఆ చుట్టుపక్కల వారికన్నా ఆ విషయం తెలియజేస్తారు.
కానీ, ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో 13 ఏండ్ల బాలిక ఒంటిపై, తలపై గాయాలతో అవస్థపడుతుంటే అక్కడ గుమిగూడిన వారు మాత్రం ఆమెకు సాయం చేయలేదు. కనీసం సాయం చేయాలన్న ఆలోచన కూడా వాళ్లకు రాలేదు. కానీ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసుకోవడంలో మాత్రం ఒకరికొకరు పోటీపడ్డారు. సాయం కోసం బాలిక అర్థిస్తున్నా పట్టించుకోకుండా.. వీడియో రికార్డింగ్లో బిజీ అయ్యారు.
అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ప్రకారం పోలీసులు వచ్చే వరకు బాధితురాలికి ఎవరూ సాయం చేయలేదు. కానీ వచ్చిరావడంతో ఓ పోలీస్ ఆ బాలికను చేతులపై ఎత్తుకుని ఆటోవైపు పరుగెత్తాడు. ఆటోలో వేసుకుని ఆస్పత్రికి తరలించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మొబైల్లో వీడియోలు తీస్తున్నవారిపై విమర్శలు, సాయం చేసిన పోలీసులకు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
కన్నౌజ్కు చెందిన బాలిక ఆదివారం ఉదయం పిగ్గీ బ్యాంక్ను కొనుగోలు చేయడం కోసం బయటికి వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. సాయంత్రం స్థానికంగా ఉన్న ప్రభుత్వ గెస్ట్హౌస్ సమీపంలో తీవ్ర గాయాలతో పడివుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలికను చికిత్స కోసం కాన్పూర్కు తరలించారు.