ముంబై: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. పలు దేశాల్లో వైరస్ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో దేశానికి మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టీకా తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించే వారిపై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానే మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా టీకాలు వేసుకోని వారిని పబ్లిక్ బస్సుల్లో ప్రయాణాలకు అనుమతించబోమని ప్రకటించింది.
బస్సులో ప్రయాణించే వారు తప్పకుండా వ్యాక్సిన్ ధ్రువీకరణను చూపాలని పేర్కొంది. నగర మేయర్ నరేష్ మాస్కే ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యం కోసం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఒక్క డోసు అయినా తీసుకోని ఉద్యోగులకు జీతాలు చెల్లించబోమని థానే పాలక మండలి ఇటీవల హెచ్చరించింది.