ముంబ్రా: వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్ని నెలలకే వాళ్ల ఇష్టాలు అయిష్టాలుగా మారిపోయాయి. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. రెండు నెలల క్రితం గొడవ తీవ్రం కావడంతో భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. స్నేహితురాలితో కలిసి విడిగా ఉంటున్నది. ఈ క్రమంలో భర్త కాపురానికి రావాలని కోరగా భార్య నిరాకరించింది. దాంతో వెంట తీసుకెళ్లిన కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితురాలిని కూడా దారుణంగా పొడిచి చంపాడు.
మహారాష్ట్రలోని థానే పట్టణంలోగల ముంబ్రా ఏరియాలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని నెలల క్రితం ముంబ్రా ఏరియాకు చెందిన కిరణ్ విత్తల్ ఖందారే, నగేశ్ బాలు రూపేట్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత వాళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఇద్దరూ గొడవపడ్డారు. దాంతో నగేశ్ భార్య కిరణ్ ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితురాలు జ్యోతి శంకర్ ఇంట్లో ఉంటోంది.
దాంతో ఇటీవల నగేశ్ తన భార్య స్నేహితురాలైన జ్యోతి శంకర్ ఇంటికి వెళ్లి అక్కడున్న తన భార్యను కాపురానికి రమ్మని కోరాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెనుగులాటకు దారితీసింది. ఈ క్రమంలో నగేశ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో కిరణ్ను మెడ, కడుపు, కాళ్లు, చేతులపైన విచక్షణారహితంగా పొడవటం మొదలుపెట్టాడు. దాంతో జ్యోతిశంకర్ తన స్నేహితురాలిని కాపాడేందుకు మధ్యలో వెళ్లగా ఆమెను కూడా ఇష్టమొచ్చినట్లు పొడిచాడు.
ఈ ఘటనలో మెడపై తీవ్ర గాయమైన జ్యోతిశంకర్ అక్కడికక్కడే కుప్పకూలింది. దాంతో నగేశ్ బాలు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం కత్తిపోట్లతో రోడ్డు మీదకు వెళ్లిన కిరణ్ ఖందారేను పెట్రోలింగ్ పోలీసులు చూసి ఆరా తీశారు. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి, జ్యోతిశంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు నగేశ్ బాలును అదుపులోకి తీసుకున్నారు.