ముంబై: శివసేనలోని రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే పదో వర్ధంతి సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ముంబైలోని శివాజీ పార్కులో ఉన్న ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కొందరు షిండే రాకతో ఆ ప్రాంతం అపవిత్రమైందని.. గో మూత్రం, నీటితో బాలాసాహెబ్ మెమోరియల్ను శుద్ధి చేశారు.
అయితే ఉద్ధవ్ వర్గం తీరుపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలాసాహెబ్ ఏ ఒక్కరికి చెందినవారు కాదని షిండే వర్గానికి చెందిన ఓ నేత అన్నారు. థాక్రేకు ఎవరైనా నివాళులు అర్పించవచ్చని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో బాలాసాహెబ్కు షిండే శ్రద్ధాంజలి ఘటించారని వెల్లడించారు.