న్యూయార్క్, సెప్టెంబర్ 30: రోడ్డుపై, నీళ్లలో నడిచే కార్లను జేమ్స్ బాండ్ సినిమాల్లోనే చూశాం. దాన్ని నిజం చేయబోతున్నది టెస్లా కంపెనీ. నీళ్లపై నడిచే కారును అందుబాటులోకి తెస్తామని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. సైబర్ట్రక్ మాడల్ కారులో ఈ సదుపాయం ఉంటుందని వెల్లడించారు. ఈ కారు వాటర్ ప్రూఫ్గా ఉండబోతున్నదని, నీళ్లపై కాసేపు బోట్లా పనిచేస్తుందని వివరించారు. ఈ కారును నదులు, సరస్సులు, సముద్రాలు దాటేలా డిజైన్ చేస్తున్నామని తెలిపారు. 2019లోనే సైబర్ట్రక్ డిజైన్ను విడుదల చేసిన టెస్లా.. ఇప్పటి వరకు మార్కెట్లోకి తీసుకురాలేదు. 2023 ప్రథమార్థంలో ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయని సమాచారం. కాగా, ఈ కారు బాడీని రాకెట్లలో ఉపయోగించే స్టెయిన్లెస్ స్టీల్తో తయారుచేస్తున్నారు. స్పోర్ట్స్ కారు కంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుందని కంపెనీ చెప్తున్నది.