న్యూఢిల్లీ: బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)కి చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ తనిఖీలు మూడవ రోజులోకి ఎంటర్ అయ్యాయి. అయితే గత రెండు రాత్రుల నుంచి పది మంది ఉద్యోగులు బీబీసీ ఆఫీసులోనే ఉన్నారు. ఐటీ దాడులు మొదలైన నాటి నుంచి వాళ్లు ఇంటికి వెళ్లలేదు. పన్ను ఎగవేత, ఆదాయం దారి మళ్లింపు ఆరోపణలపై.. ఐటీశాఖ బీబీసీ ఆఫీసుల్లో సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.
యధావిధిగా తమ న్యూస్ను బ్రాడ్కాస్ట్ చేస్తున్నామని ఢిల్లీ బీబీసీలోని ఓ ఉద్యోగి తెలిపారు. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల నుంచి అధికారిక ఫైనాన్షియల్ డేటాను ఐటీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు ఐటీశాఖ అధికారులు బీబీసీ ఆఫీసులోకి ఎంటరయ్యారు. గడిచిన 45 గంటలుగా సోదాలు జరుగుతున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.
ఐటీ దాడులకు సంబంధించి ఆ శాఖ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆ దర్యాప్తునకు సహకరిస్తున్నట్లు బీబీసీ ఓ ట్వీట్లో తెలిపింది.