తిరువనంతపురం: ఒక ఆలయ పూజారి బురఖా ధరించి రోడ్డుపై తిరుగుతున్నాడు. గమనించిన స్థానికులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేరళలోని కోయిలాండిలో ఈ సంఘటన జరిగింది. మెప్పయూర్ సమీపంలోని ఆలయంలో 28 ఏళ్ల జిష్ణు నంబూతిరి పూజారిగా ఉన్నాడు. ఈ నెల 7న ముస్లిం మహిళలు ధరించే బురఖాను అతడు ధరించాడు. ఆ దుస్తుల్లో కోయిలాండి జంక్షన్ వద్ద తిరుగుతున్నాడు. అయితే బురఖాలో ఉన్న పూజారి జిష్ణు నంబూతిరిని స్థానిక ఆటో డ్రైవర్లు గమనించారు. అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కాగా, బురఖా ధరించి తిరుగుతున్న పూజారి జిష్ణు నంబూతిరిని పోలీసులు ప్రశ్నించారు. తనకు ‘చికెన్స్ పాక్స్’ ఉందని అందుకే బురఖా ధరించినట్లు అతడు చెప్పాడు. అయితే ఆ పూజారి శరీరంపై ఆ వ్యాధి లక్షణాలు లేవని పోలీసులు తెలిపారు. దీంతో అతడి పేరు, చిరునామా ఇతర వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. అతడి బంధువులు కూడా పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు వివరించారు. బురఖా ధరించి తిరుగుతున్న పూజారిపై ఎలాంటి నేరారోపణలు లేవన్నారు. ఈ నేపథ్యంలో పూజారి జిష్ణు నంబూతిరిని పంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.