థానే: అలీబాబా దస్తాన్ ఏ కాబుల్ టీవీ సీరియల్ ఫేమ్ తునిషా శర్మ (21) మృతి కేసులో ఆమె సహనటుడు షీజాన్ ఖాన్ (Sheezan Khan)కు బెయిల్ లభించింది. దాంతో ఇవాళ థానే సెంట్రల్ జైలు నుంచి అతడు విడుదలయ్యాడు. తునిషా శర్మ గత ఏడాది డిసెంబర్ 24న షూటింగ్ సెట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో షీజాన్ ఖానే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలపై పోలీసులు డిసెంబర్ 25న షీజాన్ను అరెస్ట్ చేశారు.
ఘటనకు సంబంధించి షీజాన్ విచారణ అనంతరం షీజాన్ను థానే సెంట్రల్ జైలుకు పంపించారు. అప్పటి నుంచి అతను జైల్లోనే ఉన్నాడు. ఇటీవల పాల్ఘర్ జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. శనివారం బెయిల్ మంజూరైంది. దాంతో ఇవాళ షీజాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. కాగా, గత డిసెంబర్ 24న పాల్ఘర్ వసాయి ప్రాంతంలో ‘అలీబాబా దస్తాన్ ఏ కాబుల్’ టీవీ సీరియల్ సెట్లో తునీషా శర్మ (Tunisha Sharma) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.
టీవీ నటులైన షీజాన్, తునిషాల మధ్య కొన్నాళ్లు ప్రేమాయణం నడిచింది. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు సరిగ్గా 15 రోజుల ముందు తునిషాకు షీజాన్ బ్రేకప్ చెప్పాడు. దాంతో మనస్తాపానికి గురైన తునిషా ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని క్షణాల ముందు వరకు కూడా షూటింగ్ సెట్లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలపై షీజాన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.