లక్నో, ఏప్రిల్ 18: ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం ఆమె జాన్పూర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా కొనసాగుతున్నారు. 2009 ఎన్నికల్లో జాన్పూర్ నుంచి ఆమె భర్త ధనంజయ్ సింగ్ బీఎస్పీ తరపున ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా ఆయన పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కిడ్నాప్, దోపిడీ కేసులో ఆయన జైలుపాలయ్యారు. దీంతో శ్రీకళారెడ్డి ఎన్నికల బరిలో దిగారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన శ్రీకళారెడ్డిది రాజకీయ కుటుంబం. ఆమె తండ్రి కీసర జితేందర్ రెడ్డి 1972లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు.
త్రిముఖ పోటీ
జాన్పూర్లో ముందుగా బీజేపీ అభ్యర్థి కృపాశంకర్ సింగ్, సమాజ్వాదీ అభ్యర్థి బాబూసింగ్ కుశ్వాహ మధ్యనే పోటీ ఉంటుందని అనుకున్నా బీఎస్పీ తరపున శ్రీకళారెడ్డి కూడా బరిలోకి దిగడంతో త్రిముఖ పోరు నెలకొన్నది. కాగా, శ్రీకళారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో భారీగా ఆస్తులను చూపించారు. తనకు రూ.6.71 కోట్ల చరాస్తులు, రూ.780 కోట్ల స్థిరాస్తులు, రూ.1.74 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నట్టు ఆమె ప్రకటించారు. ధనంజయ్ సింగ్కు రూ.5.31 కోట్ల స్థిరాస్తులు, రూ.3.56 కోట్ల చరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు.