JEE advanced | ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ హైదరాబాద్ జోన్కు చెందిన తెలంగాణ విద్యార్థి వావిలాల చిద్విలాస్రెడ్డి (నాగర్కర్నూల్ జిల్లా) ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. టాప్ టెన్ ర్యాంకర్స్లో హైదరాబాద్ ఐఐటీ జోన్ విద్యార్థులు ఆరుగురు ఉన్నారు. వావిలాల చిద్విలాస్ రెడ్డికి 1వ ర్యాంకు, రమేష్ సూర్య తేజకు 2వ ర్యాంకు,
అడ్డగడ వెంకట శివరామ్కు 5వ ర్యాంకు, బిక్కిన అభినవ్ చౌదరికి 7వ ర్యాంకు, నాగిరెడ్డి బాలాజీ రెడ్డికి 9వ ర్యాంకు, యక్కంటి పాణి వేంకట మనీంధర్ రెడ్డికి 10వ ర్యాంకు వచ్చింది. హైదరాబాద్ జోన్కే చెందిన మరో తెలంగాణ విద్యార్థి నాయకంటి నాగ భవ్యశ్రీ 298 మార్కులతో ఆలిండియా 56వ ర్యాంకు దక్కించుకుంది. చిద్విలాస్ రెడ్డి మొత్తం 360 మార్కులకు 341 మార్కులు సాధించాడు.
ఈ నెల 4న రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1,80,226 మంది హాజరయ్యారు.ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల కాగా, ఆదివారం ముందు ఫైనల్ కీని విడుదల చేసిన ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ను ఐఐటీ గువాహటి నిర్వహించగా, సీట్ల భర్తీని ఆ సంస్థే చేపడుతున్నది. ఫలితా ల కోసం https:// jeeadv.ac.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
సోమవారం నుంచి జోసా కౌన్సెలింగ్
ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు సహా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జోసా కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. బీటెక్, బీఎస్సీ, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. తొలుత జోసా కౌన్సెలింగ్ తర్వాత ఐఐటీలు మినహా మిగిలిన విద్యాసంస్థల్లోని సీట్లను సెంట్రల్ సీట్ అలకేషన్బోర్డు (సీశాబ్) చేపడుతుంది. ఆదివారం ఫలితాలు విడుదలైన మరుసటి రోజైన సోమవారం నుంచే కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జాతీయంగా 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, మరో 38 కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో సీట్లను జోసా కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. సోమవారం నుంచి జూలై 26 వరకు 38 రోజులపాటు కౌన్సెలింగ్ కొనసాగనున్నది.
ఎన్ఐటీల్లో ప్రవేశాలకు రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు
దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో 40 వేలకు పైగా సీట్ల భర్తీకి నిర్వహించే సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీసాబ్) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) రూర్కీకి సీ-సాబ్ బాధ్యతలు అప్పగించింది. 3 లక్షలకు పైగా జేఈఈ మెయిన్ అభ్యర్థులు సీసాబ్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాలున్నాయి. ఇక ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు పొందేవారు ప్లస్ టు లెవల్లో (12వ తరగతి లేదా ఇంటర్లో) 75% మార్కులు, లేదా టాప్-20 పర్సంటైల్ పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు 65% మార్కులు పొందితే సరిపోతుంది. గతంలో ఈ నిబంధన అమల్లో ఉండగా, కరోనా కారణంగా మినహాయింపునిచ్చి, తాజాగా పునరుద్ధరించారు.
జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా..
జూన్ 19 అభ్యర్థుల రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్
జూన్ 25 మాక్ సీట్ల కేటాయింపు -1
జూన్ 27 మాక్ సీట్ల కేటాయింపు -2, ఆప్షన్లు ఫ్రీజ్ చేసే అవకాశం
జూన్ 28 రిజిస్ట్రేషన్ ముగింపు
జూన్ 29 సీట్ల కేటాయింపు డేటా వెరిఫికేషన్
జూన్ 30 మొదటి విడత సీట్ల కేటాయింపు
జూలై 6 రెండో విడత సీట్ల కేటాయింపు
జూలై 12 మూడో విడత సీట్ల కేటాయింపు
జూలై 16 నాలుగో విడత సీట్ల కేటాయింపు
జూలై 21 ఐదో విడత సీట్ల కేటాయింపు
జూలై 26 ఆరో విడత సీట్ల కేటాయింపు
(ఐఐటీల్లో సీట్ల కేటాయింపు తుది రౌండ్)