(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి)
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల ఆశజూపిన స్వామిజీలపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఢిల్లీ బీజేపీ పెద్దల్లో వణుకు పుట్టిస్తున్నది. బేరసారాలు జరుపుతూ అడ్డంగా దొరికిన బ్రోకర్లలో ఒకరైన రామచంద్రభారతి స్వామికి చెందిన ఫరీదాబాద్లోని ఆయన ఆశ్రమంలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేపట్టనున్నట్టు సమాచారం.
తెలంగాణ పోలీసులు తమ ఆశ్రమంలో తనిఖీలు చేపట్టకుండా ఆశ్రమానికి చెందిన కొందరు ఫరీదాబాద్ పోలీసుస్టేషన్లో కౌంటర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. హర్యానాలో ఎలాగూ బీజేపీ సర్కారే అధికారంలో ఉన్నది. దీంతో సైబరాబాద్ పోలీసులను హర్యానా పోలీసులు అడ్డుకొనే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తతంగాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. మరోవైపు, మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నాలుగైదు రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రంలో తాజాగా జరిగిన ఉదంతం ఆయన పర్యటనపై ప్రభావం చూపుతుందా? తెలంగాణ సమాజం నడ్డాతోపాటు బీజేపీ నేతల రాకను అడ్డుకొంటే పరిస్థితి ఏమిటని ఢిల్లీ పెద్దలు లోలోపల ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తున్నది.