న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు రానున్నారు. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ మౌసమీ భట్టాచార్య, మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సుజయ్ పాల్ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే కేరళ హైకోర్టు జడ్జి అను శివరామన్ను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఈ మేరకు ఇతర హైకోర్టులకు బదిలీ చేయాలన్న ఆయా న్యాయమూర్తుల విన్నపాన్ని ఆమోదించినట్టు కొలీజియం తెలిపింది.
‘కలకత్తా హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయాలని జస్టిస్ మౌసమీ భట్టాచార్య కోరారు. జస్టిస్ అను శివరామన్ను కేరళ హైకోర్టు నుంచి కర్ణాటక హైకోర్టుకు పంపుతున్నాం. మధ్యప్రదేశ్ హైకోర్టులో తన కుమారుడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నందున, అక్కడ్నుంచి బదిలీ చేయాలని జస్టిస్ సుజయ్ పాల్ కోరారు. న్యాయ పరిపాలన సౌలభ్యం కోసం వీరిని బదిలీ చేయడానికి ఆమోదిస్తున్నాం’ అని కొలీజియం పేర్కొన్నది.