వారణాసి: బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav)కు అవమానం జరిగింది. ఆయనకు చెందిన లగేజీని హోటల్ రూమ్ నుంచి తొలగించారు. ఈ ఘటన వారణాసిలోని ఓ హోటల్లో జరిగింది. కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం వెళ్లినప్పుడు.. హోటల్ రూమ్లో ఉన్న లగేజీని బయటకు తీసి రిసెప్షన్ కౌంటర్ వద్ద పెట్టారు. మంత్రి తేజ్ పర్సనల్ అసిస్టెంట్ విశాల్ సిన్హా దీనిపై ఫిర్యాదు చేశారు. మంత్రికి రూమ్ కేటాయించిన తర్వాత ఆ రూమ్ నుంచి ఎలా లగేజీని తీసేశారని ఆయన ప్రశ్నించారు.
శుక్రవారం రాత్రి దర్శనం తర్వాత తేజ్ ప్రతాప్ హోటల్కు రాగానే.. ఆయన లగేజీ రిసెప్షన్ వద్ద ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఘటన పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏసీపీ సంతోష్ సింఘ్ వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 6న బీహార్ పర్యావరణ శాఖ తరపున రూమ్ బుక్ అయిందని, కానీ ఏడవ తేదీన మరొకరికి ఆ రూమ్ బుక్ అయి ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇంతకీ ఆ రూమ్ ఎవరి పేరిట్ బుక్ చేశారో హోటల్ మేనేజ్మెంట్కు తెలియదని, తేజ్ ప్రతాప్ యాదవ్ కోసం యాజమాన్యం చాలా సేపు ఎదురుచూసిందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.