న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో మూడు నెలల బాలిక అనారోగ్యాన్ని నయం చేసే పేరుతో ఓ మంత్రగాడు ఇనుప చువ్వను కాల్చి 51 సార్లు కడుపుపై గుచ్చి చంపిన ఘటనను మరువకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ మంత్రగాడు ఏడాది బాలుడిని నేలకేసి కొట్టడమేగాక, నోట్లో పళ్లను విరగ్గొట్టి చంపేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ జిల్లాలోని ధకర్ గ్రామంలో అనూజ్ అనే ఏడాది బాలుడు అనారోగ్యం బారినపడ్డాడు. దాంతో కుటుంబసభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఓ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లారు. బాలుడిని బాగుచేసే పేరుతో ఆ మంత్రగాడు అతడిని నేలకేసి కొట్టాడు. అంతేగాక, బాలుడి నోట్లోని పళ్లను విరగ్గొట్టాడు.
దాంతో ఆ పసిబిడ్డ అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. ఇది గమనించి కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. దాంతో బాధిత కుటుంబం బాలుడి భౌతికకాయాన్ని స్థానిక పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
దాంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, బులంద్షహర్ జిల్లాలో ఆరోగ్య కేంద్రాలు సరిపడా లేవని, ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కూడా డాక్టర్లు అందుబాటులో ఉండరని, ప్రైవేటు క్లినిక్లకు వెళ్లాలంటే పేదలకు మోయలేని ఆర్థిక భారమని.. అందుకే ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.