జైపూర్: ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేని యువకుడు గన్తో కాల్చుకుని మరణించాడు. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం రాత్రి మహాత్మా గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఒక యువకుడు తుపాకీతో తలపై కాల్చుకున్నాడు. అక్కడున్న వారు గమనించి ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఉదయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం అతడు చనిపోయాడు.
కాగా, మృతుడ్ని 17 ఏళ్ల యశ్ వ్యాస్గా పోలీసులు గుర్తించారు. కలిసి స్కూల్లో చదివిన బాలిక, అతడు ప్రేమించుకున్నట్లు తెలిపారు. అయితే ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో మనస్థాపం చెందిన యశ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గన్తో కాల్చుకునే ముందు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని తెలిపారు. యువకుడి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి అతడి కుటుంబానికి అప్పగించినట్లు చెప్పారు. మరోవైపు ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.