బెంగళూరు: మతాంతర సంబంధం నేపథ్యంలో సోదరుడు తన సోదరిని చెరువులోకి తోసేశాడు. కుమార్తెను రక్షించేందుకు ఆ చెరువులోకి దూకిన తల్లి కూడా మరణించింది. (Teen Killed Over Interfaith Relationship కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. బెంగళూరుకు 175 కిలోమీటర్ల దూరంలోని హున్సూర్లోని గ్రామానికి చెందిన 19 ఏళ్ల ధనుశ్రీకి అదే ప్రాంతానికి చెందిన ముస్లిం యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ఆమె సోదరుడు నితిన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు ధనుశ్రీ, నితిన్ మధ్య ఈ విషయంపై వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన నితిన్ సోదరి ధనుశ్రీని చెరువులోకి తోసేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఇది చూసిన ధనుశ్రీ తల్లి ఆందోళన చెందింది. 43 ఏళ్ల ఆ మహిళ తన కుమార్తెను రక్షించేందుకు ఆ చెరువులోకి దూకింది. ఈ నేపథ్యంలో ధనుశ్రీ, ఆమె తల్లి చెరువులో మునిగి మరణించారు. మరోవైపు నితిన్ జరిగిన విషయాన్ని తన బంధువుకు చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తల్లీ, కుమార్తె మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీశారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నితిన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.