Sanjay Raut @ ED Office | మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించింది. సౌత్ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్లో గల ఈడీ ఆఫీసుకు మధ్యాహ్నం 11.30 గంటలకు సంజయ్ రౌత్ చేరుకున్నారు. తిరిగి రాత్రి 9.30 గంటలకు ఈడీ కార్యాలయాన్ని వీడారు. ఈడీ కార్యాలయం బయట సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు సంస్థ విచారణకు సహకరిస్తానని చెప్పారు.
`దర్యాప్తు సంస్థ డ్యూటీ విచారణ చేయడం. వారి విచారణకు సహకరించడం మన డ్యూటీ. ఈ రోజు విచారణకు రావాలని వారు (ఈడీ అధికారులు) కోరారు. ఈడీ అధికారులకు నా సహకారాన్ని కొనసాగిస్తాను` అని సంజయ్ రౌత్ తెలిపారు. పత్రా చావల్ హౌసింగ్ కాంప్లెక్స్ రీ డెవలప్మెంట్ స్కామ్పై సంజయ్ రౌత్ను ఈడీ ప్రశ్నించింది. గత ఏప్రిల్లో ఆయన ఆస్తులను జప్తు కూడా చేసింది.
మహారాష్ట్రలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం ముందు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీసు వద్దకు శివసేన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో వారు రోడ్డు దాటి ఆఫీసు వద్దకు రాకుండా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు.