ముంబై: మహారాష్ట్రలో అంధేరి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన అభ్యర్థి రుతుజా లట్కే ఘన విజయం సాధించారు. రుతుజాకు మొత్తం 66,247 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత 12,776 ఓట్లతో నోటా రెండో స్థానంలో నిలిచింది. రుతుజా లట్కే భర్త రమేశ్ లట్కే మరణంతో అంధేరి ఈస్ట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
అయితే, ఎన్నికలు వచ్చేలోపే ఏక్నాథ్ షిండే అధికార శివసేన పార్టీని చీల్చి మొత్తం 40 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ పంచన చేరాడు. దాంతో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన సర్కారు కూలిపోయింది. బీజేపీతో కలిసి ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ క్రమంలో అంధేరిలో తన వర్గం శివసేన తరఫున ఉద్ధవ్ రుతుజా లట్కేను బరిలో దించారు.
దాంతో రుతుజాపైన బీజేపీ ముర్జీపటేల్ను పోటీకి పెట్టింది. ఏక్నాథ్ షిండే వర్గం శివసేన కూడా ముర్జీ పటేల్కు మద్దతు ప్రకటించింది. అనంతరం ఏమైందో ఏమోగానీ బీజేపీ తన అభ్యర్థిని పోటీ నుంచి ఉపసంహరించుకుంది. దాంతో చిన్నాచితకా పార్టీలు, ఇండిపెండెంట్లు మాత్రమే రుతుజాపై పోటీకి మిగిలారు. కానీ ఏ ఒక్కరూ రెండో స్థానంలో కూడా నిలువలేకపోయారు. చివరికి రెండో స్థానంలో నిలిచిన నోటాకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.