బస్తీ: అతడో కూలీ. రోజూ పనికి వెళితే కానీ పూట గడవని స్థితి. అలాంటి వ్యక్తి బ్యాంక్ ఖాతాలో ఏకంగా 221 కోట్ల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు డిపాజిట్ చేశారు. ఇంకేముంది ఇన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినందుకు ఐటీ కట్టాలంటూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపడంతో అతడు లబోదిబోమంటున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా బర్టానియా గ్రామానికి చెందిన శివప్రసాద్ నిషాద్ (Shiv Prasad Nishad) అనే రోజు కూలీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఐటీ ఆఫీస్కు రావాలంటూ తనకు నోటీసులు వచ్చాయని, అయితే వాటి గురించి తనకు అవగాహన లేదని చెప్పాడు. కొద్ది ఏండ్ల క్రితం తన పాన్ కార్డును పోగొట్టుకున్నానని, బహుశా దానితో ఎవరైనా తనపేరుతో అక్రమాలకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు.