క్యాన్సర్.. ఆధునిక మానవాళికి సవాల్ విసురుతున్న వ్యాధి. ప్రతి ఆరు మరణాల్లో ఒకటి అది కబళించినదే. ఈ తరుణంలో టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రిసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ వైద్యరంగంలో ఓ ఆశారేఖగా నిలిచింది. తిరగబెట్టే క్యాన్సర్ను నివరించడానికి ఓ గోలీని తయారు చేసింది. జూన్ నాటికి ఈ ట్యాబ్లెట్ మార్కెట్లోకి రానున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (కడవేర్గు రాజశేఖర్ స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): వివిధ క్యాన్సర్లతో ప్రపంచంలో ఏటా కోటి మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతీ ఆరు మరణాల్లో ఒకటి క్యాన్సర్దే కావడం ఆందోళన కలిగిస్తున్నది. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీ తదితర ప్రక్రియలతో క్యాన్సర్ను కట్టడి చేస్తున్నప్పటికీ, ఆ మహమ్మారి తిరగబెడుతుండటంతో మరణాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. అయితే, తిరగబెట్టే క్యాన్సర్లను కూడా అరికట్టడానికి ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రిసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఓ అరుదైన గోలీని అభివృద్ధి చేశారు. ఈ గోలీతో మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉండదని వాళ్లు చెబుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో ఇదో గొప్ప మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.
క్యాన్సర్ చికిత్సలో భాగంగా జరిపే రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీలో లక్షిత క్యాన్సర్ కణాలను విచ్ఛిన్నం చేసి మహమ్మారిని క్రమం గా తగ్గుముఖం పట్టించే ప్రయత్నం చేస్తారు. అయితే, విచ్ఛిన్నమైన ఈ కణాలు (వీటిని క్రొమాటిన్ కణాలుగా పిలుస్తారు) రక్తం ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు చేరి అక్కడి ఆరోగ్యకరమైన కణాల్లోకి చేరుతాయి. ఆలా ఆయా భాగాల్లో గడ్డలను ఏర్పాటు చేసి క్యాన్సర్ను తిరగబెడతాయి. అయితే, టాటా పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేసిన ఈ గోలీ.. రక్తంలోకి చేరగానే, క్రొమాటిన్ కణాలను పూర్తిగా నాశనం చేస్తుంది. తద్వారా క్యాన్సర్ను తిరగబెట్టకుండా అడ్డుకొంటుంది. అంతేకాదు, క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకొనే రేడియేషన్ థెరపీ, కీమోథెరపీతో పాటు ఈ గోలీని తీసుకొంటే థెరపీలో భాగంగా ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ 50 శా తం మేర తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు.
క్యాన్సర్ కణాలను ఇంజెక్ట్ చేసిన ఎలుకల్లో తొలుత ఈ గోలీని ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్టు పరిశోధనలలో భాగమైన వైద్యుడు డాక్టర్ రాజేంద్ర బాడ్వే తెలిపారు. సైడ్ ఎఫెక్ట్స్కు సంబంధించిన ప్రయోగాలు ఎలుకలతో పాటు మనుషులపై కూడా చేశామని అన్నారు. అయితే తిరగబెట్టే క్యాన్సర్ కట్టడి ప్రయోగాలు ప్రస్తుతానికి ఎలుకల్లోనే చేపట్టామని, అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నారు. ఇవే ప్రయోగాలు మనుషులపై చేయాలంటే మరో ఐదేండ్లు పట్టొచ్చని వెల్లడించారు. అయినప్పటికీ, ఈ డ్రగ్కు ఆమోదం కోసం ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కి దరఖాస్తు చేసుకొన్నట్టు చెప్పారు. అనుమతులు లభిస్తే, వచ్చే జూన్-జూలై నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్సకు రూ. లక్షల్లో ఖర్చు అవుతున్నప్పటికీ, తాము ఈ గోలీని రూ. 100కే అందుబాటులోకి తీసుకురానున్నట్టు వివరించారు.
ఈ డ్రగ్ అభివృద్ధి కోసం పదేండ్ల పాటు పరిశోధనలు నిర్వహించినట్టు బాడ్వే తెలిపారు. ఈ పరిశోధనలతో సమయం, డబ్బు వృథా అవుతున్నదా? అనే అనుమానాలు తొలుత బృంద సభ్యులకు కలిగినా.. చివరకు సానుకూల ఫలితాలు దక్కడంతో అందరం సంతోషంగా ఉన్నట్టు ఆయన సంబురపడ్డారు. క్యాన్సర్ చికిత్సలో ఈ గోలీ ఓ గొప్ప మైలురాయిగా అభివర్ణించారు.