Tata Steel | న్యూఢిల్లీ, జనవరి 29: భారత్లో ప్రముఖ ఉక్కు తయారీ కంపెనీలుగా ఉన్న టాటా స్టీల్కు చెందిన యూకే ప్లాంట్, లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలోని ఆర్సెలార్ మిట్టల్కు చెందిన ఇటలీ ప్లాంట్ మూసివేత అంచున ఉన్నాయి. ఆయా కంపెనీల కార్యకలాపాలకు వ్యతిరేకంగా లేవనెత్తిన వివిధ పర్యావరణ అంశాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. దీని వలన ఆ రెండు కంపెనీల్లో పనిచేసే వేలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు.
టాటా స్టీల్ తన వెల్ష్ స్టీల్వర్క్స్లోని రెండు బొగ్గు ఆధారిత బ్లాస్ట్ ఫర్నేస్లను మూసివేసి పర్యావరణహిత(గ్రీనర్), చౌకైన స్టీల్ తయారీ యూనిట్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. క్యాన్సర్ కారక రసాయనాలను వెదజల్లుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వం టేకోవర్ చేయనున్నది. యూకేలో టాటా స్టీల్ మూసివేతతో 2024 చివరి నాటికి 2,800 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది.
పర్యావరణ సమస్యల నేపథ్యంలో ఇటలీలోని టారన్టోలో ఉన్న మిట్టల్ కంపెనీకి చెందిన స్టీల్ప్లాంట్ను ప్రభుత్వం టేకోవర్ చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ సంస్థ తన గ్యాస్ సరఫరాదారునికి 200 మిలియన్ డాలర్ల అప్పును కూడా ఎదుర్కొంటున్నది. ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్కు సరఫరా నిలిపివేసేందుకు ఇటీవల ఇటలీ కోర్టు సదరు గ్యాస్ కంపెనీకి అనుమతి ఇచ్చింది.
ఐరోపాలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్లలో ఒకటిగా ఉన్న ఈ కంపెనీలో ఆ దేశ ప్రభుత్వానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ ‘ఇన్విటాలియా’కు కూడా వాటా ఉన్నది. ఆర్సెలార్ మిట్టల్ను మేనేజ్మెంట్ నుంచి తొలగించేందుకు అవసరమైన ప్రక్రియను పర్యవేక్షించేందుకు ‘స్పెషల్ అడ్మినిస్ట్రేషన్’ను ప్రవేశపెట్టేందుకు చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించింది. ఈ ‘స్పెషల్ అడ్మినిస్ట్రేషన్’ అనేది ఇటలీలో దివాలా కంపెనీలకు సంబంధించిన స్కీమ్. మిట్టల్ స్టీల్ కంపెనీ మూసివేత వల్ల దాదాపు 10 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు.