చెన్నై: పరందుర్ వద్ద నిర్మించాలనుకున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్(CM Vijay) తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. సెక్షన్ 110 కింద ఆయన ప్రకటన చేస్తూ.. ప్రతిపాదిత విమానాశ్రయం కోసం కొత్త సైట్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆ లొకేషన్ను ఫైనలైజ్ చేస్తామన్నారు. ఇక టెక్నిల్ ఫీజిబులిటీ గురించి నిపుణులు పరిశీలిన చేయనున్నట్లు సీఎం విజయ్ చెప్పారు. గత డీఎంకే ప్రభుత్వాన్ని సీఎం విజయ్ తప్పుపట్టారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలను తరలించే ప్రాంతాన్ని గత ప్రభుత్వం విమానాశ్రయ ప్రాజెక్టు కోసం తీసుకున్నదని, దీంతో పాటు వ్యవసాయంపై కూడా ఆ ప్రాంతంలో తీవ్ర ప్రభావం పడనున్నదని ఆయన అన్నారు.
పరందుర్ వద్ద విమానాశ్రయ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నట్లు సీఎం విజయ్ స్పష్టం చేశారు. మరో వైపు చెన్నై విమానాశ్రయాన్ని విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. చెన్నై విమానాశ్రయంలో అయిదో టర్మినల్ నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. దీని వల్ల ఏడాదికి 2 కోట్ల మంది అదనంగా విదేశీ ప్రయాణం చేసే వీలు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏడాదికి సుమారు 3 కోట్ల మంది ప్రయాణికులు చెన్నై విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మూడవ టర్మినల్ పూర్తి అయితే విమానాశ్రయ సామర్థ్యం పెరగనున్నది.