విల్లివాక్కం: బధిరురాలు అయిన 10 ఏళ్ల బాలిక 2002లో పదేళ్ల వయసులో తప్పిపోయింది. ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంటికి తిరిగొచ్చింది. దాంతో ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పెన్నాగరం సమీపంలోని కెండయనళ్లి పుదూర్కు చెందిన వెంకటాచలం, మాతమ్మాల్ దంపతుల కుమార్తె రమ్య బధిరురాలు. దాంతో ఆమెను ప్రైవేట్ బధిరుల పాఠశాలలో చేర్చారు.
ఈ క్రమంలో 2002లో పాఠశాల తరఫున రమ్య రైల్లో కర్ణాటక టూర్కు వెళ్లింది. అక్కడ పర్యాటక ప్రదేశాలను చూపించడానికి స్కూల్ వాళ్లు పిల్లలను తీసుకెళ్లారు. అయితే, ఆ టూర్లో రమ్య తప్పిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు అన్ని విధాలుగా వెతికినా జాడ దొరకలేదు. ఈ క్రమంలో ధర్మపురి జిల్లాకు చెందిన బధిరురాలు ముంబైలో ఉన్నదని చెన్నైలోని బధిరుల సంస్థకు ఓ మహిళ ఫొటో పంపింది. ఆ ఫొటోను బధిరుల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా పలు సోషల్ మీడియా గ్రూప్లలో పోస్ట్ చేసింది.
దాంతో ఆఖరికి రమ్య తల్లిదండ్రుల వరకు ఆ ఫొటో చేరింది. ఆ మహిళ తమ కుమార్తె కావచ్చని భావించి ఆమె తల్లిదండ్రులు సదరు సంస్థను సంప్రదించారు. అక్కడికి వెళ్లిన తర్వాత చేతికి ఉన్న పచ్చ బొట్టును చూసి తమ కుమార్తేనని నిర్ధారించారు. బధిరుల సంస్థ నిర్వాహకులు మహారాష్ట్రలోని పుణెలో ఉన్న సంస్థ వారిని సంప్రదించి రమ్యని చెన్నైకి రప్పించారు. అనంతరం ధర్మపురిలో ఆమెను తన కుటుంబానికి అప్పగించారు.