చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన మండూస్ తుఫాను తీరం వైపు దూసుకొస్తున్నది. దాంతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. చెన్నై మహా నగరంలో కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో చెన్నైలోని పార్కులు, ప్లే గ్రౌండ్లను మూసివేయాలని గ్రేటర్ చెన్నై మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.
అదేవిధంగా డిసెంబర్ 10న చెన్నై మహా నగరంలోని స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. ప్రతికూల వాతావరణం కారణంగా చెన్నై ఎయిర్పోర్టుకు విమానాలు రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా మారింది. దాంతో అధికారులు ఇవాళ చెన్నై ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.