COVID 19: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపధ్యంలో బీచ్లు, బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. బీచ్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను అనుమతించబోమని తమిళనాడు డీజీపీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
తాగి వాహనాలు నడపరాదని పౌరులకు పోలీసులు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడే వారిని అరెస్ట్ చేయడంతో పాటు వారి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటల వరకే కొవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించి అనుమతిస్తామని చెప్పారు.
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ప్రైవేట్ పార్టీలకు కూడా నియంత్రణలు వర్తిస్తాయని తెలిపారు. ప్రజలు నూతన సంవత్సర వేడుకలను కుటుంబంతో కలిసి ఇండ్లలోనే జరుపుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సూచించారు. దూరప్రాంతాలకు ప్రయాణించే వారు ద్విచక్రవాహనాలపై కాకుండా రైలు, బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.