శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రసంగ ప్రతిని చదవడం ఆనవాయితీ. అది ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ల అతి జోక్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనకు నచ్చినది చదువుతా, నచ్చనిది వదిలేస్తా అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తాజాగా ఆ రాష్ట్ర శాసనసభలో వ్యవహరించిన తీరు విస్మయపరుస్తున్నది. బీజేపీయేతర రాష్ర్టాలు, రాజ్భవన్ల మధ్య నడుస్తున్న వివాదాన్ని ఆయన పరాకాష్ఠకు తీసుకెళ్లారు.
చెన్నై, జనవరి 9: శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రసంగ ప్రతిని చదవడం ఆనవాయితీ. అయితే తనకు నచ్చినది చదువుతా, నచ్చనిది వదిలేస్తా అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభలో వ్యవహరించిన తీరు విస్మయపరుస్తున్నది. బీజేపీయేతర రాష్ర్టాలు, రాజ్భవన్ల మధ్య నడుస్తున్న వివాదాన్ని ఆయన పరాకాష్టకు తీసుకెళ్లారన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్కు ఉపన్యాస పాఠం అందుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల పనులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తీసుకొన్న చర్యలు, తీసుకోబోయే నిర్ణయాలపై ప్రసంగం ఉంటుంది. అది ఉన్నది ఉన్నట్టు గవర్నర్ చదవడం ఆనవాయితీ. కానీ, సోమవారం తమిళనాడు అసెంబ్లీలో అందుకు విరుద్ధంగా జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఉపన్యాసం కాకుండా, గవర్నర్ తన సొంత కవిత్వాన్ని ప్రదర్శించారు. తమిళనాడులోని ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు ప్రసంగ పాఠంలో ఉన్నా, గవర్నర్ మాత్రం ఆ పేర్లను చదవలేదు. ప్రసంగం ఇది కాదు కదా! అని ముఖ్యమంత్రి అడిగితే.. ఏకంగా సభ నుంచే వాకౌట్ చేసి సభా మర్యాదను తుంగలో తొక్కారు.
తమిళనాడు అన్న పదాన్ని పలకలేదు..
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభను ఉద్దేశించి సోమవారం గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడారు. ఆ ప్రసంగంలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, ద్రవిడియన్ మాడల్ అన్న పాయింట్ను చదవకుండా వదిలేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వం అందజేసిన ప్రసంగం కాకుండా సొంతంగా మాట్లాడటంతో డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. సీఎం స్టాలిన్ లేచి.. గవర్నర్ ఉపన్యాసం పక్కదారి పట్టించేలా ఉన్నదని అన్నారు. దీంతో ఆర్ఎన్ రవి తన ప్రసంగాన్ని ఆపేసి సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో జరిగిన ఈ వ్యవహారం షాక్కు గురిచేసింది. అనంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడు అన్న పదాన్ని గవర్నర్ పలకలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగంలో ఉన్న విషయాలను చదవకుండా ఇక్కడి ప్రజలను అవమానించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డు చేయాలని, గవర్నర్ ప్రసంగంలోని అభ్యంతర వ్యాఖ్యలను తొలగించాలని స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని సభ ఆమోదించింది.
ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయం
తమిళనాడు ప్రభుత్వం
చెన్నై, జనవరి 9: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని తమిళనాడులో అమలుచేసే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సామాజిక న్యాయ సిద్ధాంతాలకు విరుద్ధమని, రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 69% రిజర్వేషన్ల విధానాన్ని అలాగే కొనసాగిస్తామని సోమవారం తమిళనాడు శాసనసభకు సమర్పించిన గవర్నర్ ప్రసంగ ప్రతిలో స్పష్టం చేసింది. రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ, మైనారిటీల ఆర్థికాభివృద్ధి సంస్థ ద్వారా రూ.210 కోట్ల విలువైన రుణాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది.