చెన్నై: తమిళనాడు గవర్నర్ రవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయాలని కోరినట్లు తెలుస్తున్నది. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని తమిళనాడు కామన్ స్కూల్ సిస్టమ్ వేదిక డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు చేత వాతలు పెట్టించుకున్న తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేశాక, గవర్నర్ రవి ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని కాంగ్రెస్ నేత శశికాంత్ ఎక్స్ పోస్ట్లో దుయ్యబట్టారు. ‘నా ఎజెండాను ఇతర మార్గాల్లో అమలు చేస్తాను’ అనే సందేశాన్ని రవి ఇస్తున్నారని ఆయన అన్నారు.
లా కమిషన్ చీఫ్గా జస్టిస్ దినేశ్ మహేశ్వరి!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి త్వరలో 23వ లా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కమిషన్ను నిరుడు సెప్టెంబరు 2న ఏర్పాటు చేశారు. దీని పదవీ కాలం మూడేళ్లు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టవచ్చునా? అనే అంశాన్ని పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం ఈ కమిషన్కు అప్పగించింది. జస్టిస్ దినేశ్ మహేశ్వరి 2019 జనవరి నుంచి 2023 మే వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు.