చెన్నై: పొంగల్ నేపథ్యంలో ప్రతి ఏటా జనవరి నెలలో తమిళనాడులో సంప్రదాయంగా నిర్వహించే ‘జల్లికట్టు’కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే కరోనా నేపథ్యంలో పలు ఆంక్షలు విధించింది. టీకా రెండు డోసులు తీసుకున్న వ్యక్తులు మాత్రమే ఎద్దును పట్టుకునే ఈ సంప్రదాయ క్రీడలో పాల్గోవాలని తెలిపింది. అలాగే 48 గంటల ముందుగా ఆర్టీ-పీసీఆర్ కరోనా టెస్ట్ చేయించుకుని నెగిటివ్ రిపోర్ట్ కలిగి ఉండటం తప్పనిసరి అని చెప్పింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యం లేదా 150 మంది వీక్షకులు మాత్రమే ఉండాలని పేర్కొంది.
మరోవైపు జల్లికట్టు క్రీడలో పాల్గొనేందుకు ఇద్దరిని మాత్రమే అనుతిస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఎద్దు వెంట యజమాని, సహాయకుడు మాత్రమే ప్రాంగణంలోకి వెళ్లనిస్తామని చెప్పింది. ఆ ఇద్దరు వ్యక్తులకు జిల్లా యంత్రాంగం ఐడీ కార్డులను అందజేస్తుందని వివరించింది. ఐడీ కార్డులు లేని వారిని బరిలోకి అనుమతించరని స్పష్టం చేసింది. ఈ మేరకు జల్లికట్టు నిర్వహణకు సంబంధించిన నియమ, నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను తమిళనాడు ప్రభుత్వం సోమవారం జారీ చేసింది.