చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫూని (Night Curfew) తమిళనాడు ప్రభుత్వం ఎత్తివేసింది. శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ప్రతి ఆదివారం అమలుచేస్తున్న పూర్తిస్థాయి లాక్డౌన్ను కూడా రద్దు చేసింది. దీంతోపా ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని విద్యాసంస్థలను తిరిగి తెరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఫస్ట్ తారీఖు నుంచి ఒకటి నుంచి 12వ తరగతి వరకు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం కానుంది.
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించడంతో ఈ నెల 7 నుంచి రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ, 9వ తారీఖు నుంచి ఆదివారాల్లో సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో కర్ఫ్యూ, లాక్డౌన్ను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాసంస్థలు తెరవనుండటంతో రాష్ట్రంలో 10 నుంచి 12 తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నది.