చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 12 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా విద్యా రంగంపై రాష్ట్రాల ప్రాముఖ్యతను పునరుద్ధరించడానికి రాష్ట్రాల ఐక్యతను కూడగట్టేందుకు ఆయన ప్రయత్నించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్తో పాటు గోవా సీఎంలకు ప్రత్యేకంగా లేఖలు రాశారు.
తమిళనాడులో మెడికల్ అడ్మిషన్లపై నీట్ ప్రభావంపై జస్టిస్ ఏకే రాజన్ కమిటీ నివేదికను అనువాదం చేసిన ప్రతితోపాటు నీట్కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన ప్రయత్నాలను ఆ లేఖలో స్టాలిన్ వివరించారు. ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందడంలో గ్రామీణ ప్రాంత, సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా ఈ పత్రాలను పరిశీలించి నీట్ రద్దుకు మద్దతు అందించాలని 12 రాష్ట్రాల సీఎంలను ఆయన అభ్యర్థించారు. డీఎంకే ఎంపీల బృందం ఈ లేఖలను ఆయా రాష్ట్రాల సీఎంలను కలిసి అందజేయనున్నారు.
ఇటీవల నీట్ పరీక్షపై భయం, అర్హత సాధించలేమన్న ఆందోళనతో తమిళనాడులో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నీట్ను రద్దు చేస్తూ తమిళనాడు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల ప్రవేశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. నీట్ రద్దుకు ప్రయత్నిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన డీఎంకే చీఫ్ స్టాలిన్, అధికారంలోకి వచ్చాక ఈ మేరకు చర్యలు చేపట్టారు. తమిళనాడులో నీట్కు వ్యతిరేకంగా చట్టం చేయడంతోపాటు జాతీయ స్థాయిలో మద్దతు కోసం 12 రాష్ట్రాల సీఎంలకు తాజాగా లేఖలు రాశారు.