చెన్నై: కోయంబత్తూర్లో ఈ నెల 23న జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఎన్ఐఏ దర్యాప్తు కోరింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తునకు రికమెండ్ చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు చేస్తున్న దర్యాప్తులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు వెలుగుచూడటంతో స్టాలిన్ ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కోరారు.
కోయంబత్తూరు కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేయాలని, కోయంబత్తూర్లో కావాల్సిన భద్రతా ఏర్పాట్లను కొనసాగించాలని స్టాలిన్ తన రికమెండేషన్ లేఖలో కోరారు. ఈ నెల 23న కోయంబత్తూరులోని ఉక్కడంలో ఓ కారులో సిలిండర్ పేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించాయి.
పేలుడుకు ముందు సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు పోలీసులకు పలు అనుమానాలు రావడానికి కారణమయ్యాయి. పేలుడులో మరణించిన మొబిన్తోపాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి మొబిన్ ఇంటి నుంచి తెచ్చిన బస్తాను కారులో పెట్టడం, ఆ తర్వాత కారులో పేలుడు జరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మొబిన్ ఇంట్లో సోదాలు చేయగా భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.