న్యూఢిల్లీ, మార్చి 21: పశ్చిమ బెంగాల్లో రాజకీయ పార్టీలు మారడం వల్ల రాజకీయ నాయకులకు అసెంబ్లీ ఎన్నికల టికెట్లు లభించవచ్చు కాని తమిళనాడులో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నం. ఇక్కడ పార్టీ ఫిరాయింపులు అరుదుగా ఎన్నికల విజయాలుగా పరిణమిస్తాయి. 2011, 2016, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషిస్తే 130 మంది ఫిరాయింపుదారులలో కేవలం 23 మంది మాత్రమే విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. కాని బెంగాల్లో అది దాదాపు సగం ఉంది. తమిళనాట మాత్రం అలాంటి వారి గెలుపు రేటు కేవలం 18 శాతం మాత్రమే ఉంది. సంఖ్య తక్కువగా ఉండడమే కాదు అది క్రమంగా పడిపోతున్నది కూడా. ఉదాహరణకు 2011లో 24 శాతం మంది ఫిరాయింపుదారులు గెలుపొందగా, 2016లో అది 15 శాతానికి పడిపోయింది. 2021లో అదే 15 శాతం కొనసాగింది. మరో మాటలో చెప్పాలంటే తమిళనాడులో ప్రతి ఐదుగురు ఫిరాయింపుదారులలో నలుగురు ఓటమి పాలయ్యారు.
రాష్ట్రంలోని ప్రధాన ద్రవిడ పార్టీలలో సైతం పార్టీ ఫిరాయింపుల వల్ల ఒనగూరే ప్రయోజనం చాలా స్వల్పం. గడచిన మూడు అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే నుంచి పోటీ చేసిన 42 మంది ఫిరాయింపుదారుల్లో 10 మంది మాత్రమే విజయం సాధించారు. ఏఐఏడీఎంకే అభ్యర్థులలో 31 మంది ఫిరాయింపుదారుల్లో 9 మంది మాత్రమే గెలిచారు. ఫిరాయింపుదారులను విజేతలుగా మార్చే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదని ఈ అంకెలు చెబుతున్నాయి. తమిళనాడులో ఫిరాయింపులు విఫలం చెందడానికి కారణమేంటని విశ్లేషిస్తే అభ్యర్థుల కన్నా పొత్తులే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని అర్థమవుతున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రం ఈ వాదనను బలపరుస్తుందని చెప్పవచ్చు. అధికార డీఎంకే సారథ్యంలోని కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఇతర ప్రాంతీయ పక్షాలు భాగస్వాములుగా ఉన్నాయి. గతంలో ఈ కూటమి సానుకూల ఫలితాలను సాధించింది. మొదట్లో కాంగ్రెస్ కూడా తమకు ఎక్కువ సీట్లను కేటాయించాలని డిమాండ్ చేసినప్పటికీ చివరకు 28 సీట్లకు సర్దుకుంది. దీంతో ఏఐఏడీఎంకే వ్యతిరేక కూటమిలో సీట్ల కేటాయింపులు సమస్యగా పరిణమించలేదు.
ఇది కూటమిలో ఐక్యతను చూపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే బీజేపీ, ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీకి వెళుతున్నది. అయితే ఈ కూటమిలో సీట్ల కేటాయింపులు కాగితాలపైనే కనిపిస్తున్నాయి కాని కూటమిలోని పార్టీల మధ్య ఇంకా ఐక్యత కానరావడం లేదు. ఈ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్కు చెందిన తమిళగ వెట్రి కళగం బరిలోకి దిగడం ప్రత్యేక ఆకర్షణ కానున్నది. ఏ కూటమిలో చేరడానికి ఇష్టపడని టీవీకే ప్రస్తుతానికి రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయనన్నట్లు ప్రకటించింది. అదే జరిగితే తమిళనాడు త్రిముఖ పోటీని చూస్తుంది. ఇది టీవీకేకు బలం ఉందని భావిస్తున్న పట్టణ ప్రాంతాలు, యువజనుల్లో ఓట్ల చీలికకు దారి తీసే అవకాశం ఉంది. అదే సమయంలో ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయించదలచిన నాయకులలో అనిశ్చితిని సృష్టించనున్నది.