శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో పొడవైన జాతీయ జెండా ఎగురనున్నది. వంద అడుగుల ఎత్తులో రెపరెపలాడే భారీ త్రివర్ణ పతాకాన్ని ఈ నెల 10న జాతికి అంకితం చేయనున్నారు. శ్రీనగర్లోని చారిత్రక హరి పర్బత్ కోటలో పొడవైన జాతీయ జెండాను భారత ఆర్మీ, సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దీని కోసం భారత పురావస్తు శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. ఫిబ్రవరి 7న శంకుస్థాపన చేసి రికార్డు సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేశారు. వంద అడుగుల ఎత్తు, 24 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పు కలిగిన జాతీయ జెండాను ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 10న ఆవిష్కరించనున్నారు.
ఈ భారీ త్రివర్ణ పతాకం గుల్మార్గ్కు ప్రధాన పర్యాటక ఆకర్షణగాను, ల్యాండ్మార్క్గాను నిలుస్తుందని భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ తెలిపింది. ‘ఒక జెండా, ఒక భూమి, ఒక గుండె, ఒక చేయి’ అని ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.