సీడీఎస్ బిపిన్రావత్ను రోల్మోడల్గా తీసుకుంటూ, కెరీర్లో ముందుకు సాగాలని సైనిక విధుల్లో చేరుతున్న వారికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సూచించారు . డెహ్రాడూన్ మిలటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మాట్లాడుతూ.. బిపిన్ రావత్ లేనిలోటు పూడ్చలేనిదన్నారు. ఆయనో అసాధారణ వ్యక్తి అని కొనియాడారు. ఒకవేళ హెలికాప్టర్ దుర్ఘటన జరగకపోయి ఉంటే, ఈ రోజు రావత్ కూడా తనతో కలిసి ఈ పరేడ్లో పాలుపంచుకునేవారని కోవింద్ గుర్తు చేసుకున్నారు. నూతనంగా సైన్యంలో చేరుతూ, తమ శిక్షణను పూర్తి చేసుకున్న వారికి కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు.
బిపిన్ రావత్ దుర్మరణం అన్న షాక్ నుంచి తేరుకోక మునుపే ఇక్కడ సమావేశమయ్యామని, రావత్ ఈ కేంద్రంలోనే శిక్షణ తీసుకొని, అనేక మెడల్స్ను సాధించారని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. రక్షణ విషయంలో దేశం ఓ సవాల్ను ఎదుర్కొంటోందని, దీనికి అందరూ మానసికంగా సన్నద్ధమై ఉండాలని, ఓ వ్యూహాత్మకమైన మానసిక పరిణతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అనుకోని సవాళ్లు ఎదురైనప్పుడు కూడా వాటిని ఎదుర్కోడానికి సంసిద్ధత వ్యక్తం చేసేలా ఉండాలని రాష్ట్రపతి కోవింద్ ఆకాంక్షించారు.