ముంబై, సెప్టెంబర్ 25: మీడియా మేనేజ్మెంట్లో బీజేపీని మించిన పార్టీ మరొకటి లేదని తరుచుగా వచ్చే ఆరోపణలు నిజమేనని నిరూపించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తమ గురించి వ్యతిరేక వార్తలు రాయకుండా జర్నలిస్టులను మచ్చిక చేసుకోవాలంటూ పార్టీ కార్యకర్తలకు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే సూచించినట్టు ఉన్న ఓ ఆడియో క్లిప్ వైరలవుతున్నది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో పార్టీ కార్యకర్తలతో చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. జర్నలిస్టులు మనకు వ్యతిరేకంగా వార్తలు రాయకుండా చూసుకోవాలి. చాయ్ తాగడానికి వారిని ఆహ్వానించి దాబాలకు తీసుకెళ్లండి. మర్యాదలు చేయండి. ఎలాంటి చాయ్ గురించి చెప్పానో మీకు అర్థమయ్యిందనుకుంటా’ అని పేర్కొన్నారు. ఈ ఆడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు స్పందించాయి. ‘జర్నలిస్టులందరూ అమ్ముడుపోరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అని సూచించాయి.