Taj Mahal | ఆగ్రాలోని తాజ్ మహల్లో మూసి ఉన్న 22 తలుపులను తెరువాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ గురువారం విచారణ జరిపింది. పిటిషన్ను జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ సుభాష్ విద్యార్థి ధర్మాసనం కొట్టి వేసింది. ఎలాంటి పరిశోధన చేయకుండా ఎలా పిటిషన్ వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయోధ్యకు చెందిన డాక్టర్ రజనీష్ సింగ్ ఈ పిటిషన్ను ఇటీవల దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్లో చరిత్రకారుడు పీఎన్ ఓక్ రాసిన తాజ్ మహల్ పుస్తకాన్ని ఉటంకిస్తూ తాజ్ మహల్ వాస్తవానికి తేజో మహాలయ అనీ, దీన్ని క్రీస్తు శకం 1212లో రాజు పర్మర్ది దేవ్ నిర్మించారని పిటిషన్లో పేర్కొన్నారు.
తాజ్ మహల్లో మూసివేసిన తలుపుల లోపల శివుడి ఆలయం ఉందని పిటిషన్లో తెలిపారు. తాజ్మహల్కు సంబంధించి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి తాజ్మహల్లోని దాదాపు 22 మూసి ఉన్న తలుపులను తెరిచేలా అధ్యయనం చేసి ఆదేశాలు జారీ చేయాలని, దీంతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పిటిషన్ పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ తాజ్ మహల్ గురించి దేశ పౌరులు నిజానిజాలు తెసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పిటిషన్ మాట్లాడుతూ ఈ విషయంపై పలు సార్లు ఆర్టీఐ కింద దాఖలు చేశానని, భద్రతా కారణాల దృష్ట్యా తెరువడం లేదని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ఆగ్రాలో కేసు నమోదైందని, దీనిపై పిటిషనర్కు ఎలాంటి అధికార పరిధి లేదని పేర్కొన్నారు.
అయితే, తాజ్ మహల్ శివుడికి, అల్లాకు సంబంధించిందనే విషయంపై మాట్లాడడం లేదని, మూసి ఉన్న గదుల వెనుక ఏముందో మనందరం తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ను మందలించింది. తాజ్మహల్పై పూర్తి స్థాయి పరిశోధన చేసిన తర్వాతే.. పిల్ వేయాలని పిటిషనర్ని మందలిచింది. పిల్ను ఎగతాళి చేయవద్దని.. కనీసం అవగాహన లేకుండా.. ఇష్టానుసారం పిల్ వేస్తారా? అని మండిపడింది. ముందు తాజ్మహల్ను ఎవరు నిర్మించారు? ఎప్పుడు కట్టారన్న వివరాలు తెలుసుకోవాలంటూ పిటిషన్ను కొట్టివేసింది. పరిశోధన చేయకుండా ఎవరైనా అడ్డుకుంటే మళ్లీ ధర్మాసనాన్ని ఆశ్రయించాలని సూచించింది.