ఆగ్రా : పర్యాటకులకు ప్రేమసౌధం తాజ్ మహల్ స్వాగతం పలుకుతున్నది. మూడు రోజుల పాటు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆర్కియాలజీ అధికారులు తెలిపారు. ఐదో మొఘల్ చక్రవర్తి షాజహాన్ 367 ఉర్స్ సందర్భంగా ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు సందర్శకులకు ఉచితంగా ఎంట్రీ కల్పించనున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆగ్రా సర్కిల్ సూపరింటెండెంట్ రాజ్కుమార్ పటేల్ తెలిపారు. అయితే, సందర్శకులు తప్పనిసరిగా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని స్పష్టం చేశారు.
ఉర్సు సందర్భంగా ఆనవాయితీ ప్రకారం చాదర్ పోషి, శాండల్, గుసుల్, కుల్ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టూరిస్ట్ గైడ్స్ అసోసియేసన్ అధ్యక్షుడు షంసుద్దీన్ ఖాన్ తెలిపారు. షకీల్ రఫీక్ అనే టూరిస్ట్ గైడ్ మాట్లాడుతూ షాజహాన్, ఆయన భార్య ముంతాజ్ అసలైన సమాధులను సందర్శించేందుకు పర్యాటకులు నేలమాళిగలోకి వెళ్లేందుకు సంవత్సరంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారని తెలిపాడు.