ఉదయ్పూర్/జైపూర్, జూన్ 28: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే ఓ టైలర్ను దారుణంగా హత్య చేశారు. కత్తితో తల నరికి మొండెం నుంచి వేరుచేశారు. ఈ ఘటన ధన్మండీ ఏరియాలోని ఒక దుకాణంలో చోటుచేసుకున్నది. హత్యకు సంబంధించిన వీడియోను నిందితులు సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఉద్రిక్తతలు రాజేసింది. టైలర్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద మతపరమైన పోస్టు ఈ హత్యకు కారణంగా ఉన్నది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య నేపథ్యంలో నగరంలో భారీగాబలగాలు మోహరించారు. కర్ఫ్యూ విధించారు. ప్రజలు గుమిగూడకుండా రాష్ట్రవ్యాప్తంగా నెల పాటు నిషేధాజ్ఞలు విధించారు. 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. ప్రజలు సంయమనం వహించాలని సీఎం అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. హత్య వీడియోలను షేర్ చేయొద్దని కోరారు. హత్య దర్యాప్తునకు పోలీసు ఉన్నతాధికారులు సిట్ ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ ఉదయ్పూర్కు ఎన్ఐఏ బృందాన్ని పంపింది. హత్య కేసును ఎన్ఐఏకు బదిలీ చేసే అవకాశం కనిపిస్తున్నది.
కస్టమర్ల మాదిరిగా వెళ్లి..
హత్య అనంతరం పరారైన నిందితులు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తామే ఈ హత్య చేసినట్టు అంగీకరించారు. నిందితులు సాధారణ కస్టమర్ల మాదిరిగా టైలర్ దుకాణంలోకి వెళ్లారు. ఓ నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో టైలర్పై దాడి చేయగా, మరో వ్యక్తి ఫోన్లో వీడియో తీశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక మార్కెట్లు మూతపడ్డాయి. పోలీసులు మృతదేహాన్ని తీసుకుపోనివ్వకుండా దుకాణాదారులు అడ్డుకున్నారు. సోషల్ మీడియాలో చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి స్థానిక పోలీసులు ఆ టైలర్ను ఇటీవల అరెస్టు చేశారు.