AI Summit : దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ ఐటీ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు సోమవారం ప్రారంభమైంది. అయితే, ఈ సదస్సులో సోమవారం చాలా గందరగోళం తలెత్తింది. దీంతో అతిథులు చాలా ఇబ్బందిపడ్డారు. ఈ అంశంపై కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. అతిథులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు. సదస్సు నిర్వహణ విషయంలో తమ ప్రభుత్వం సానుకూల, విశాల దృక్పథంతో ఉందన్నారు. ఎవరు, ఎలాంటి సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు.
‘‘ఇది ప్రపంచంలోనే తొలి, అతిపెద్ద ఏఐ సదస్సు. దీనికి వస్తున్న స్పందన అద్భుతం. ఇప్పుడు నిర్వహణ చాలా బాగుంది. నిన్న జరిగిన గందరగోళానికి క్షమాపణలు. ఇంకా ఎవరైనా, ఏదైనా సమస్య ఎదుర్కొంటే నిరభ్యంతరంగా చెప్పొచ్చు. మీరు సదస్సును మరింత ఎక్కువ ఆస్వాదించేలా చర్యలు తీసుకుంటున్నాం. నిన్నటి నుంచి వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం. రాత్రి పగలు కష్టపడుతున్నాం’’ అని అశ్విని వైష్ణవ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ను ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహిస్తోంది. పలు అంతర్జాతీయ ఏఐ, టెక్ కంపెనీలకు చెందిన సీఈవోలు, ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు. దేశ, విదేశాలకు చెందిన అతిథులు భారీ సంఖ్యలో వస్తున్నారు. స్టార్టప్ కంపెనీల సీఈవోలు, ఔత్సాహికులు పాల్గొంటున్నారు. ఈ స్థాయిలో ఏఐ సదస్సు నిర్వహించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. దీంతో ఈ సదస్సు సాధించే ఫలితాలపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, సదస్సు నిర్వహణలో అనేక లోపాలు బయటపడ్డాయి. చాలా మంది అతిథులు ఈ అంశంలో నిర్వాహకులపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.
తమకు సరైన గైడెన్స్ ఇచ్చే వారే కరువయ్యారన్నారు. సెక్యూరిటీ చెకప్లు కూడా అతిగా చేస్తున్నారు. దీంతో చాలా సేపు క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. అలాగే ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. చాలా మంది డెలిగేట్స్ సమయానికి ఈవెంట్కు చేరుకోలేకపోయారు. సెక్యూరిటీ పేరుతో కొన్ని చోట్లు ముందుగా ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా తీసేశారు. కొన్ని చోట్ల చోరీలు కూడా జరిగాయి. ఇలాంటి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నట్లు అతిథులు చెబుతున్నారు. ఈ విషయంలో నిర్వాహకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతోవ్యయ ప్రయాసలకోర్చి వస్తే సరైన సౌకర్యాలు లేవని మండిపడుతున్నారు. ఈ సదస్సుకు తొలి రోజు 70,000 మంది అతిథులు హాజరైనట్లు అంచనా.