ముంబై: జైపూర్-ముంబై సెంట్రల్ ఎక్స్ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మృతుల్లో హైదరాబాద్కు చెందిన సయ్యిద్ సైఫుల్లా(Syed Saifullah) ఉన్నాడు. నాంపల్లికి చెందిన అతనికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆ ముగ్గురిలో చిన్న అమ్మాయి వయసు ఆరు నెలలు మాత్రమే. హైదరాబాద్లోని నాంపల్లిలో సైఫుల్లా ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్నాడు. ఆ షాపు ఓనర్తో పాటు అజ్మీర్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ముంబై మీదుగా అతను హైదరాబాద్ వచ్చేందుకు ప్లాన్ చేశాడు. సయ్యిద సైఫుల్లా కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు.
కానిస్టేబుల్ చేతన్ చంపిన వారిలో 48 ఏళ్ల అస్గర్ షేక్ ఉన్నాడు. బీహార్లోని మధుబన్ జిల్లాకు చెందిన అతను ఉద్యోగం కోసం మొదటిసారి ముంబై వెళ్తున్నాడు. జైపూర్లో మూడేళ్ల నుంచి అతను గాజులు అమ్మాడు. అయితే సంపాదన సరిపోకపోవడంతో.. అతను ముంబై వెళ్లేందుకు రైలెక్కాడు. అస్గర్కు భార్య, నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఇక కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మరో వ్యక్తి అబ్దుల్ ఖాదిర్ మొహమ్మద్. మహారాష్ట్రలోని నాలా సోపారాలో అతను 25 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. అతనికి భార్య ఇద్దరు కుమారులు, ఓ కోడలు, మనువడు ఉన్నారు. అతని ఫ్యామిలీ దుబాయ్కి వెళ్లింది. ముగ్గురు ప్రయాణికులతో పాటు ఏఎస్ఐ టికా రామ్ మీనాను కూడా కానిస్టేబుల్ చేతన్ కాల్చి చంపిన విషయం తెలిసిందే.