న్యూఢిల్లీ: వారం రోజుల కిందట భారత్కు వచ్చిన స్విట్జర్లాండ్ మహిళ మృతదేహం (Swiss Woman’s Body) ఒక స్కూల్ పక్కన పడి ఉంది. కాళ్లు, చేతులు కట్టేసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఒక నిందితుడ్ని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. శుక్రవారం పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో స్విస్ మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్రభుత్వ స్కూల్ వద్ద ఉన్న చెత్త పాడేసే నల్లని ప్లాస్టిక్ బ్యాగ్లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని స్విట్జర్లాండ్కు చెందిన 30 ఏళ్ల లీనా బెర్గర్గా గుర్తించారు. ఆమెతో సంబంధం ఉన్న గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఇంటి నుంచి రూ.2.25 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
కాగా, గురుప్రీత్ సింగ్ తరచుగా స్విట్జర్లాండ్ వెళ్లి లీనాను కలిసేవాడు. అయితే ఆమెకు మరొకరితో సంబంధం ఉన్నట్లు అనుమానించాడు. ఈ నేపథ్యంలో లీనాను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. భారత్కు రావాలని ఆమెను పిలిచాడు. దీంతో అక్టోబర్ 11న లీనా ఢిల్లీ చేరుకుంది. ఐదు రోజుల తర్వాత ఆమెను ఒక గదిలో బంధించాడు. కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశాడు.
మరొవైపు మహిళ పేరుతో కొనుగోలు చేసిన పాత కారులో లీనా మృతదేహాన్ని గురుప్రీత్ ఉంచాడు. దుర్వాసన రావడంతో చెత్త పారవేసే ప్లాస్టిక్ బ్యాగ్లో మృతదేహాన్ని ఉంచి ప్రభుత్వ స్కూల్ ముందు పడేశాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి గురుప్రీత్ సింగ్ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని ఉంచిన కారుతోపాటు మరో కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.